liquor: ‘పండుగ’ చేసుకున్న మందుబాబులు.. ఒక్కరోజే రూ.350 కోట్లు గొంతులోకి!

  • ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే రూ.100 కోట్ల విక్రయాలు
  • బార్లలో వన్ ప్లస్ వన్  ఆఫర్
  • టాప్ గేర్‌లో మాంసం విక్రయాలు 

దసరా పండుగ రోజు తెలంగాణలోని మందుబాబులు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో ‘పండుగ’ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజే రూ.350 కోట్లను ‘గొంతు’లో పోసుకున్నారు. పండుగ సందర్భంగా రాష్ట్రంలో భారీ ఎత్తున మద్యం వ్యాపారం జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. దసరా పండుగ రోజు ఏకంగా 5.5 లక్షల కేసులు విక్రయించినట్టు తెలిపారు. ఇందులో 3 లక్షల ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) కాగా, 2.5 లక్షల బీర్ల కేసులు కూడా ఉన్నాయి.

అక్టోబరు ఒకటో తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ అమల్లోకి రానుండడంతో పాత స్టాకును వదిలించుకోవడమే లక్ష్యంగా డీలర్లు విక్రయాలు సాగించారు. దీంతో చివరి మూడు రోజుల్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. బార్లలో వన్  ప్లస్ వన్ లాంటి ఆఫర్లు కూడా ప్రకటించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే రూ.వంద కోట్ల వ్యాపారం జరగ్గా గ్రామీణ ప్రాంతాల్లో రూ.250 కోట్ల విక్రయాలు జరిగాయి. మరోవైపు దసరా అంటేనే చుక్క-ముక్క అని భావించడంతో మాంసం విక్రయాలు కూడా ఎన్నడూ లేనంతగా సాగాయి. సికింద్రాబాద్, జియాగూడ, చెంగిచెర్ల తదితర హోల్‌సేల్ మాంసం మార్కెట్లలో శని, ఆదివారాల్లో రూ.30 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్టు అంచనా.

More Telugu News