బ్రహ్మోత్సవాలు: చంద్రబాబు సూచనలతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించాం: టీటీడీ ఈవో

  • బ్రహ్మోత్సవాల్లో  శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 6.27 లక్షలు
  • హుండీ ఆదాయం రూ. రూ.18.70 కోట్లు
  • ఈ నెల 18, 25 తేదీల్లో వయోవృద్ధులకు, వికలాంగులకు,       19, 26 తేదీల్లో ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు

చంద్రబాబు సూచనలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్ అన్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహన సేవలు, మూలవిరాట్ దర్శనం కల్పించామని చెప్పారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేలా చంద్రబాబు ఎప్పటికప్పుడు సూచనలు చేశారని, బ్రహ్మోత్సవాల్లో 6.27 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని, రూ.18.70 కోట్ల హుండీ ఆదాయం లభించిందని, గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం తగ్గిందని చెప్పారు.

 23 లక్షల మందికి అన్న ప్రసాదం, 26.55 లక్షల లడ్డూలు పంపిణీ చేశామని,3.06 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు. త్వరలో తమిళం, కన్నడ భాషల్లో టీటీడీ ఆన్ లైన్ సేవలు అందిస్తామని, ఈ నెల 18, 25 తేదీల్లో నాలుగు వేల మంది వయోవృద్ధులు, వికలాంగులకు, ఈ నెల 19, 26 తేదీల్లో ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశామని  అనిల్ కుమార్ సింఘాల్  తెలిపారు.

More Telugu News