balakrishna: ఆ పని చేస్తేనే కార్యకర్తలకు గుర్తింపు: బాలకృష్ణ

  • చిత్తశుద్ధితో కార్యకర్తలు పనిచేయాలి
  • గుర్తింపు ఇవ్వడంలో నేను ముందుంటా
  • గుడివాడలో హీరో బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీలో చిత్తశుద్ధితో పనిచేస్తేనే కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా గుడివాడలో మార్కెట్‌ యార్డు కమిటీ ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన బాలకృష్ణ, నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారోత్సవం చేయించిన అనంతరం ప్రసంగించారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపును ఇవ్వడంలో తాను ముందుంటానని చెప్పారు. గుడివాడకు, తనకు మధ్య ఎంతో అనుబంధం ఉందని ఆయన అన్నారు.

పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తన తండ్రి ఎన్టీఆర్ చేపట్టారని గుర్తు చేసుకున్న ఆయన, ఇక్కడి ప్రజల సమస్యలు తీర్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తానని చెప్పారు. తమ అభిమాన హీరో బాలకృష్ణను పార్టీ కార్యకర్తలు, అభిమానులు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర సహా పలువురు నేతలు హాజరయ్యారు.

More Telugu News