modi: విఫలమైన నరేంద్ర మోదీ బాణం... జావెలిన్ త్రో చేసిన ప్రధాని!

  • విరిగిన విల్లుతో లాభం లేదనుకున్న ప్రధాని
  • అంబును విసిరి రావణ వధ
  • ఎర్రకోటలో వైభవంగా దసరా ఉత్సవాలు

న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన దసరా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొన్న వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఎదురుగా రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు బొమ్మలను ఏర్పాటు చేసి, వాటిపై వేయాల్సిన విల్లంబులను మోదీ చేతికి ఇచ్చిన వేళ, ఆయన విఫలమయ్యారు. విల్లును చేత్తో ధరించి, అంబును ఎక్కు పెట్టాలని ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది. విల్లు కాస్తంత విరిగి ఉండటమే ఇందుకు కారణమని సమాచారం. ఇక రెండు మూడు సార్లు విల్లును ఎక్కు పెట్టాలని చూసిన ఆయన ఇక లాభం లేదని నిర్ణయించుకుని, నవ్వుతూ అంబును జావెలిన్ త్రోలా విసిరారు. ఆపై సంప్రదాయ దసరా ఉత్సవం వైభవంగా సాగింది.

ఈ కార్యక్రమం వేదికపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితర ప్రముఖులు ఆసీనులయ్యారు. దసరా ఉత్సవాల సందర్భంగా మోదీ మాట్లాడుతూ, పండగలు సమాజంలో చైతన్యం నింపే ఉత్సవాలని అన్నారు. భారతీయ విలువలను దసరా, దీపావళి వంటి పర్వదినాలు కాపాడుతున్నాయని, జాతిని ఏకం చేస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఐదేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలపై ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పం చేయాలని అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి భారత ఆర్థిక వ్యవస్థను మరో మెట్టు ఎక్కించాలని పిలుపునిచ్చారు. రావణుడనే రాక్షసుడిపై రాముడు సాధించిన విజయానికి గుర్తుగా దసరాను జరుపుకుంటామని మోదీ గుర్తు చేశారు.

More Telugu News