spyder: దసరా బరిలో విజేత ఎవరు?... ప్రేక్షకుల ఓటింగ్ ఫలితమిది!

  • 'జై లవకుశ' కన్నా 'స్పైడర్' కు రెండు శాతం ఓట్లు అధికం
  • 46 శాతం ఓట్లు సాధించిన 'స్పైడర్'
  • 'మహానుభావుడు'కు 10 శాతం ఓట్లే

ఈ దసరా సీజన్ ప్రారంభంలో ఎన్టీఆర్ నటించిన 'జై లవకుశ', దుర్గాష్టమి పర్వదినానికి రెండు రోజుల ముందు మహేష్ బాబు 'స్పైడర్', పండగ నాడు శర్వానంద్ 'మహానుభావుడు' చిత్రాలు వెండి తెరను పలకరించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 21న రిలీజ్ అయిన 'జై లవకుశ'కు లాంగ్ హాలిడేస్ కలసిరాగా, ఇప్పటికే రూ. 150 కోట్ల క్లబ్ లో చిత్రం చేరిపోయింది.

ఇక 27న వచ్చిన మహేష్ బాబు సినిమా, డివైడ్ టాక్ వచ్చినా, కలెక్షన్లపై ఆ ప్రభావం కనిపించకుండా, సరికొత్త రికార్డుల దిశగా సాగుతోంది. ఈ సీజన్ లో చివరిగా వచ్చిన 'మహానుభావుడు' ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరై, ఇప్పటికే హిట్ టాక్ ను తెచ్చుకుంది.

కాగా, ఈ మూడు చిత్రాల్లో మీరు మెచ్చిన సినిమా ఏది? అంటూ ప్రముఖ తెలుగు దినపత్రిక 'సాక్షి' తన వెబ్ సైట్లో ఓ పోలింగ్ ను ఉంచగా, ఈ ఉదయం 7 గంటల సమయానికి 14,147 మంది తమ అభిప్రాయాలను చెప్పారు. ఇందులో 'జై లవకుశ'కు 6222 ఓట్లు (44 శాతం) లభించగా, 'స్పైడర్' 6,474 ఓట్లతో (46 శాతం) కాస్తంత ముందు నిలిచింది. 'మహానుభావుడు' పది శాతం ఓట్లతో 1,451 మంది మద్దతు సాధించింది.

More Telugu News