ఉత్తమ్: కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై భ‌గ్గుమ‌న్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి

  • ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అబద్ధాలు చెప్పొద్దు
  • సింగరేణి కార్మికులను కేసీఆర్ మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు
  • గ‌తంలో ఇచ్చిన వాగ్దానాలు నిల‌బెట్టుకోలేదు
  • సింగరేణికి వెళ్లడానికి కేసీఆర్‌కు మొహం చెల్లలేదు

గ‌త కాంగ్రెస్, టీడీపీ ప్ర‌భుత్వాలు సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ రోజు ధ్వ‌జ‌మెత్తిన విష‌యం తెలిసిందే. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు భ‌గ్గుమంటున్నారు. ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అబద్ధాలు చెప్పకూడ‌ద‌ని టీపీసీసీ నేత‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి హిత‌వు ప‌లికారు. సింగరేణి కార్మికులను కేసీఆర్ మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. కార్మికులకు సొంత ఇళ్లు క‌ట్టిస్తామ‌ని, రూ.10 లక్షల రుణం ఇస్తామ‌ని 2014లోనే చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు ఇళ్లు క‌ట్టుకుంటే రూ.6 లక్షల చొప్పున రుణం ఇస్తామ‌ని అంటున్నారని విమర్శించారు.

ఇటువంటి ప్ర‌చారాలకు స్వ‌స్తి చెప్పి ఇచ్చిన మాట మీద కేసీఆర్ నిల‌బ‌డాల‌ని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. మ‌రోవైపు సింగరేణి ఎన్నికల నేప‌థ్యంలో టీఆర్‌ఎస్‌ నేతలు ప్ర‌లోభాల‌కు పాల్ప‌డుతున్నార‌ని అన్నారు. మరోపక్క, కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ‌తంలో ఇచ్చిన వాగ్దానాలు నిల‌బెట్టుకోలేకపోవ‌డంతో సింగరేణికి వెళ్లడానికి కేసీఆర్‌కు మొహం చెల్లలేదని ఎద్దేవా చేశారు.

ఆ కార‌ణంగానే ఆయ‌న‌ హైదరాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించార‌ని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఈ రోజు చేసిన వ్యాఖ్య‌లు సింగ‌రేణిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియను గందరగోళపరిచేలా ఉన్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

More Telugu News