సైబర్ క్రైమ్స్: సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి.. జాగ్రత్తగా వుండాలి!: మంత్రి నారా లోకేశ్

  • ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ను త్వరలో ఏర్పాటు చేస్తాం
  • ఈ మేరకు అధికారులకు ఆదేశాలు
  • ఏపీ ఐటీ శాఖ అధికారులతో లోకేశ్ సమీక్ష

ప్రపంచ వ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయని, ప్రతి సెకన్ కు 12 మంది సైబర్ క్రైమ్స్ బారిన పడుతున్నారని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఐటీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. ప్రభుత్వాల సమాచారాన్ని హ్యాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సైబర్ దాడులు జరిగే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉందని అన్నారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడకంలో ఏపీ ప్రభుత్వం ముందంజలో ఉందని, సాఫ్ట్ వేర్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ ప్రధాన లక్ష్యాలుగా అత్యుత్తమ టెక్నాలజీతో ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. సైబర్ సెక్యూరిటీ కోసం ఇతర దేశాల్లో రూపొందించిన విధానాలను, రాష్ట్ర పరిస్థితులను అంచనా వేసి వీలైనంత త్వరగా ఈ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

‘బ్లూవేల్స్’ లాంటి ప్రమాదకర గేమ్స్ మరికొన్ని కూడా వచ్చే అవకాశం ఉందని, ఇలాంటి సైబర్ ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి నివారించాలని సూచించారు. సైబర్ క్రైమ్స్ నియంత్రణ కోసం అవసరమైతే పోలీస్ శాఖ సలహాలు తీసుకోవాలని, సైబర్ సెక్యూరిటీ విధి విధానాలను రూపొందించాలని ఈ సందర్భంగా లోకేశ్ ఆదేశించారు. 

More Telugu News