టీడీపీ: నేను టీడీపీలో చేరతాననే వార్తలు అబద్ధం : వైసీపీ నాయకుడు విశ్వరూప్

  • రాజకీయాలనైనా వదులుకుంటాను గానీ, వైసీపీని మాత్రం వీడను
  • టీడీపీ నాయకులు కొందరు మైండ్ గేమ్ ఆడుతున్నారు
  • అమలాపురంలో విలేకరులతో మాట్లాడిన విశ్వరూప్

తాను టీడీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని వైసీపీ సీనియర్ నేత పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు. అమలాపురంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, రాజకీయాలను అయినా వదులుకుంటాను గానీ, వైసీపీని మాత్రం వీడనని అన్నారు.

తాను వైసీపీ నుంచి బయటకు వస్తానని, టీడీపీ నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలతో తాను ఏనాడూ సంప్రదింపులు జరపలేదని, ఇటువంటి దుష్ప్రచారం వల్ల తమ పార్టీ కేడర్ మానసికంగా ఇబ్బంది పడుతోందని అన్నారు.

ఈ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలను ఆయన కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు విడదీయరాని సంబంధం ఉందని, ఒకవేళ తాను రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నా వైసీపీకి విధేయుడిగానే ఉంటానని విశ్వరూప్ చెప్పారు.

More Telugu News