acid: పుట్టిన రోజు వేడుక విషాదాంతం.. కూల్‌డ్రింక్‌గా భావించి యాసిడ్ తాగిన ఇద్దరు బాలుర మృతి!

  • పార్టీ ముగిసి నిమిషాలైనా గడవకముందే విషాదం 
  • డిన్నర్ సమయంలో యాసిడ్ తాగిన చిన్నారులు  
  • క్షణాలలో కుప్పకూలిన బాలురు  

పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకుని నిమిషాలైనా కాకముందే ఓ చిన్నారి, అతడి స్నేహితుడైన మరో బాలుడు మృతి చెందిన విషాద ఘటన ఇది. యాసిడ్‌ను కూల్ డ్రింక్‌గా భావించి తాగిన వారు క్షణాల్లోనే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. బెంగళూరులో ఈ విషాదం చోటుచేసుకుంది.

 పోలీసుల కథనం ప్రకారం.. కెంపెగౌడ రోడ్డులో నివాసముండే శంకర్ స్వర్ణకారుడు. కుమారుడు సాహిల్ శంకర్ పుట్టిన రోజును ఘనంగా జరపాలని నిర్ణయించిన ఆయన స్నేహితులు, బంధువులను ఆహ్వానించాడు. కేక్ కట్ చేసి వేడుక ముగిసిన తర్వాత అందరూ కలిసి డిన్నర్‌కు కూర్చుకున్నారు.

అయితే సాహిల్, అతడి స్నేహితుడు ఆర్యన్ ఓ గదిలోకి వెళ్లారు. అక్కడ ఓ గాజు సీసాలో నిల్వ చేసిన సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను చూసిన వారు దానిని కూల్ డ్రింక్‌గా భావించి తాగేశారు. ఆ వెంటనే కుప్పకూలిపోయారు. దీనిని గమనించిన బాలుడి కుటుంబ సభ్యులు వెంటనే వారిని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. వారు అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ముక్కుపచ్చలారని చిన్నారులు మృతి చెందడంతో కెంపెగౌడ రోడ్డు విషాదంలో మునిగిపోయింది.

సాహిల్ మూడో తరగతి చదువుతుండగా, ఆర్యన్ రెండో తరగతి చదువుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

More Telugu News