ganguly: ఐసీసీ కొత్త రూల్ కు స్వాగతం చెప్పిన సౌరవ్ గంగూలీ

  • లెవల్ 4 తీవ్రతతో తప్పు చేస్తే రెడ్ కార్డు
  • ఆటను వదిలి వెళ్లాల్సిందే
  • నేటి నుంచి అమలులోకి వచ్చిన న్యూ రూల్

క్రికెట్ మైదానంలో అనుచితంగా ప్రవర్తించే వారికి రెడ్ కార్డ్ ను చూపించి, ఆట నుంచి వెళ్లగొట్టే నిబంధనను బెంగాల్ ప్రిన్స్, మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్వాగతించాడు. ఆటలో తప్పుగా ప్రవర్తిస్తూ, ఇతర క్రీడాకారులపై అనుచిత ప్రవర్తనకు పాల్పడితే, అక్కడే ఉండే అంపైర్లు వెంటనే స్పందించి, అతని తప్పు తీవ్రతను బట్టి రెడ్ కార్డు చూపించే అధికారాన్ని కల్పిస్తూ, ఐసీసీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అంపైర్ ను దూషించినా, ఉద్దేశ పూర్వకంగా ఎదుటి జట్టు ఆటగాడిని అడ్డుకున్నా, చెయ్యి చేసుకున్నా, ఇతర ఆటగాడిపై హింసాత్మకంగా ప్రవర్తించినా అంపైర్ తన విశేషాధికారాలను వినియోగించే వీలును కొత్త నిబంధన కల్పిస్తుంది. సాధారణంగా లెవల్ 4 తప్పులకే రెడ్ కార్డును చూపించాల్సి వుంటుంది. లెవల్ 1 నుంచి లెవల్ 3 తీవ్రతతో ఉండే తప్పులను చేసే ఆటగాళ్లకు ప్రస్తుతం అమలులో ఉన్న ఐసీసీ ప్రవర్తనా నియమావళే వర్తిస్తుంది.

 నేటి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుండగా, దీనిపై స్పందించిన గంగూలీ, ఇకపై ఆటగాళ్ల ప్రవర్తనలో మార్పు వస్తుందని, వారు సాధారణంగా చేసే తప్పుల తీవ్రత కూడా తగ్గుతుందని అన్నాడు. ఇప్పటికే ఫుట్ బాల్, హాకీ తదితర క్రీడల్లో రెడ్ కార్డు విధానం అమలవుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News