క్రికెట్: ఆసీస్‌ ఆట తీరు చూస్తే శ్రీలంక జట్టు ప‌సుపు రంగు జెర్సీ ధరించి ఆడుతున్నట్లుంది: హర్భజన్ ఎద్దేవా

  • భారత్‌ 3-0తో ఇప్ప‌టికే సిరీస్‌ను దక్కించుకుంది
  • అలాగే, 5-0 తో ఆస్ట్రేలియాను భారత్ ఓడిస్తుంది

భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు క‌నీస పోరాట ప‌టిమ కూడా క‌న‌బ‌ర్చ‌కుండా ఓడిపోతోన్న విష‌యం తెలిసిందే. ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా జ‌రిగిన మూడు వ‌న్డేల్లోనూ ఆ జ‌ట్టు ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుని సీరీ‌స్‌ను కోల్పోయింది. ఆస్ట్రేలియాపై మిగ‌తా రెండు మ్యాచుల్లోనూ కూడా గెలిచి టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తుంద‌ని విశ్లేష‌కుల అంచనా.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా జ‌ట్టు ఆట‌తీరుపై టీమిండియా ఆట‌గాడు హర్భజన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత ఆసీస్‌ జట్టుపై విమ‌ర్శ‌లు చేశాడు. శ్రీలంక జట్టు ప‌సుపు రంగు జెర్సీ ధరించి ఆడుతున్నట్లుందని ఎద్దేవా చేశాడు. భారత్‌ 3-0తో ఇప్ప‌టికే సిరీస్‌ను దక్కించుకుందని, అలాగే 5-0 తో ఆస్ట్రేలియాను ఓడిస్తుంద‌ని జోస్యం చెప్పాడు. ప్రస్తుతం శ్రీలంక జట్టు కూడా పేలవ ప్రదర్శనను కనబరుస్తోన్న విషయం తెలిసిందే. కాగా, రేపు బెంగళూరు వేదికగా భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. 

More Telugu News