bharti airtel: 5జీ నెట్‌వ‌ర్క్ సేవ‌ల‌కు మార్గం సుగ‌మం చేస్తోన్న ఎయిర్‌టెల్‌

  • వేగ‌వంతం కానున్న మొబైల్‌ ఇంట‌ర్నెట్ స్పీడ్‌
  • మొద‌ట‌ బెంగ‌ళూరు, కోల్‌క‌తా న‌గ‌రాల్లో
  • ప్ర‌క‌టించిన భారతీ ఎయిర్‌టెల్‌

త్వ‌ర‌లో 5జీ నెట్‌వ‌ర్క్ సేవ‌లు అందించేందుకు మార్గం సుగ‌మం చేస్తోన్నట్లు టెలికాం దిగ్గ‌జ సంస్థ ఎయిర్‌టెల్ ప్ర‌కటించింది. 5జీ సేవ‌ల‌కు పునాదిగా భావించే `మాసివ్ మల్టిపుల్-ఇన్‌పుట్ మ‌ల్టిపుల్ ఔట్‌పుట్ (మీమో)` టెక్నాల‌జీని భార‌త్‌లో ప‌రిచ‌యం చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. మొద‌ట బెంగ‌ళూరు, కోల్‌క‌తా న‌గ‌రాల్లో ఈ సేవ‌ల‌ను ప్రారంభించి, ఆ త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని పేర్కొంది. ఈ టెక్నాల‌జీ వ‌ల్ల మొబైల్ ఇంట‌ర్నెట్ స్పీడ్ మ‌రింత వేగ‌వంతం కానుంది. ఇది అమ‌ల్లోకి వ‌స్తే ప్ర‌స్తుతం ఉన్న నెట్‌వ‌ర్క్ సామ‌ర్థ్యం 5-6 రెట్లు మెరుగుప‌డి, డేటా స్పీడ్ 2-3 రెట్లు పెరుగుతుంద‌ని ఎయిర్‌టెల్ అభిప్రాయ‌ప‌డింది. అంత‌ర్జాతీయంగా కొన్ని దేశాల్లో మాత్ర‌మే ఈ మాసివ్ మీమో టెక్నాలజీ అమ‌లు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. వాటిలో భార‌త్ కూడా ఉంద‌ని ఎయిర్‌టెల్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. వినియోగ‌దారులు ఉప‌యోగిస్తున్న 4జీ హ్యాండ్‌సెట్‌లోనే ఎలాంటి టారిఫ్‌లు, మార్పులు చేయ‌కుండా 5జీ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఎయిర్‌టెల్ ప్రారంభించిన `ప్రాజెక్ట్ లీప్‌`లో భాగంగా ఈ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవ‌ల టెలికాం శాఖ 2020లోగా భార‌త్‌లోకి పూర్తిస్థాయి 5జీ సేవ‌ల‌ను తీసుకువ‌స్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అందుకోసం రూ. 500 కోట్ల నిధిని కూడా ప్ర‌భుత్వం కేటాయించింది.

More Telugu News