oc reservations: అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లను కల్పించాలి.. లేకపోతే, భారీ ఉద్యమం తప్పదు: ఓసీ సంక్షేమ సంఘం వార్నింగ్

* అగ్రవర్ణాల్లో కూడా పేదలున్నారు.. ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు

* ఓసీ పేదలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే

* జాతీయ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

 * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలి... లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం

అగ్రవర్ణ పేదలు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారని... వారి జీవితాలను మెరుగుపరచడానికి రిజర్వేషన్లను కల్పించాలని... దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాలని ఓసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఆదాయ పరిమితికి లోబడి రిజర్వేషన్లను కల్పించాలని సంఘం నేత జి.కరుణాకర్ రెడ్డి తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తమ అజెండాలో చేర్చాలని కోరారు. దేశవ్యాప్తంగా 6 కోట్లకు పైగా ఉన్న అగ్రవర్ణ పేదలను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ మేజర్ జనరల్ సిన్హా నివేదిక ఇచ్చారని... దీన్ని వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.

జాతీయ స్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని... ఈ కార్పొరేషన్ కు లక్ష కోట్ల రూపాయలను కేటాయించాలని... దీంతో, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని, రిజర్వేషన్ల ఉద్యమాలు ఆగిపోతాయని కరుణాకర్ రెడ్డి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓసీల సమస్యలను పట్టించుకోవాలని... లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు.

More Telugu News