mahesh babu: ఎన్టీఆర్ అభిప్రాయాన్ని వ్యతిరేకించిన మహేష్ బాబు... టాలీవుడ్ లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్!

  • రివ్యూలను విమర్శించిన ఎన్టీఆర్
  • వివాదాలు ఎందుకని అడిగిన మహేష్
  • బాగాలేకుంటే బాగాలేదని చెబుతున్నారన్న ప్రిన్స్
  • తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదలైన 'రివ్యూ' చర్చ

మహేష్ బాబు, ఎన్టీఆర్... టాలీవుడ్ లో వీరిద్దరూ స్టార్ హీరోలు. టాప్-5 హీరోల్లో ఉంటూ, వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ, అటు తమ అభిమానులను, ఇటు సినీ ప్రేక్షకులను అలరించడంలో ముందుంటారు. వీరిద్దరూ నటించిన సినిమాలు ఒకే సమయంలో విడుదలై బాక్సాఫీసును షేక్ చేసిన సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. తమ తమ అభిప్రాయాలను సూటిగా చెప్పడంలోనూ ముందుంటారు.

కానీ, తాజాగా, సినిమా రివ్యూల విషయంలో ఒక్క రోజు తేడాలో ఈ ఇద్దరు స్టార్ హీరోలూ భిన్నమైన అభిప్రాయాలను వెల్లడించడం టాలీవుడ్ లో కొత్త చర్చకు తెరలేపింది. కొత్త సినిమాలు విడుదలైనప్పుడు విశ్లేషకులు, విమర్శకులు రివ్యూలు రాస్తారన్న సంగతి తెలిసిందే. దీనిపై ఈ ఇద్దరు హీరోల మధ్యా భిన్నాభిప్రాయలు వ్యక్తమవడమే చర్చకు కారణమైంది.

 రెండు రోజుల క్రితం జరిగిన 'జై లవకుశ' సక్సెస్ మీట్‌ లో రివ్యూలు రాసేవాళ్లను 'దారిన పోయే దానయ్య'లని, మరణశయ్యపై ఉన్న రోగి ఆరోగ్యం గురించి చెడుగా చెప్పే రకాలని ఎన్టీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న జరిగిన 'స్పైడర్' ప్రమోషన్ కార్యక్రమంలో మహేష్ బాబు, ఎన్టీఆర్ కు భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

చిత్రం బాగుంటే బాగుందని, బాగాలేకుంటే బాగాలేదని సమీక్షకులు రాస్తున్నారని, ఎందుకు వివాదాలు వస్తున్నాయో అర్థం కావటంలేదని చెప్పాడు. రివ్యూల విషయంలో ఇద్దరు స్టార్ హీరోలు రెండు పరస్పర విభిన్న అభిప్రాయాలను వెలిబుచ్చడంతో కొందరు ఎన్టీఆర్ పక్షాన నిలుస్తుండగా, మరికొందరు మహేష్ బాబు చెప్పింది కరెక్టేనని అంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

More Telugu News