India: పాకిస్థాన్ అసలు ముఖం ఇదే.. చూడండి.. దాయాది అకృత్యాలను ఐరాసలో చూపిన భారత్!

  • పాక్‌పై మరోమారు విరుచుకుపడిన భారత్
  • రెండు ఫొటోలు చూపించి ఎండగట్టిన వైనం
  • పాక్ ఇప్పుడు తన ముఖాన్ని ఎక్కడ దాచుకుంటుందని నిలదీత

అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ను ఎలాగైనా దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడిన పాకిస్థాన్ తీరుపై భారత్ మరోమారు తీవ్రస్థాయిలో దాడికి దిగింది. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో గాయపడిన పాలస్తీనా బాలికను కశ్మీరీగా చూపించి భారత్‌ను ఎండగట్టాలని పాక్ ప్రయత్నించింది. అయితే భారత్ మాత్రం కశ్మీర్‌లో పాక్ చేస్తున్న అరాచకాలను కళ్లకు కట్టినట్టు చూపించి పాక్‌ను మరోమారు దోషిగా నిలబెట్టింది.

సోమవారం ఐరాసలో భారత దౌత్యవేత్త పౌలోమి త్రిపాఠి మాట్లాడుతూ పాక్ మొన్న చూపించిన పాలస్తీనా బాలిక ఫొటోను ఒక చేత్తో, కశ్మీర్‌లో ఉగ్రమూకల చేతిలో అమరుడైన ఇండియన్ ఆర్మీ అధికారి ఫొటోను మరో చేత్తో చూపిస్తూ పాకిస్థాన్ అసలు ముఖం (నైజం) ఇదేనని ప్రపంచానికి చూపించారు. పాకిస్థాన్ ఇక తన ముఖాన్ని దాచుకునే చోటు లేదని ఎత్తిపొడిచారు.

పౌలోమి చూపించిన ఫొటోలోని ఇండియన్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్. జమ్ముకశ్మీర్‌లో షోఫియాన్  జిల్లాలో ఉమర్‌ను అపహరించిన ఉగ్రవాదులు అతడిని దారుణంగా హతమార్చారు.

More Telugu News