chandra babu: 2019, 2024, 2029లోనూ ఇదే రిపీట‌వుద్ది!: సీఎం చంద్ర‌బాబు

  • ప్రజలు మాకు మద్దతు తెలుపుతున్నారు
  • ఇంటింటికీ తెలుగుదేశం కార్య‌క్ర‌మం బాగా జరుగుతోంది 
  • ఎన్ని ఎన్నికలు జరిగినా మేమే గెలుస్తాం
  • ప్రతిపక్ష నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారు

ఇంటింటికీ తెలుగుదేశం కార్య‌క్ర‌మంలో త‌మ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు 20 ల‌క్ష‌ల ఇళ్ల‌కు వెళ్లారని టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందు‌కు ఈ కార్య‌క్ర‌మం దోహ‌దం చేస్తోంద‌ని అన్నారు. తానే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ల‌గ‌ల‌న‌ని గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపించార‌ని, 2019, 2024, 2029లోనూ ఇదే రిపీట‌వుతుంద‌ని అన్నారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లో కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న చంద్రబాబు నాయుడు అనంతరం మీడియాతో మాట్లాడుతూ... అధికారులు తమ పనితీరును మెరుగుపర్చుకుంటున్నారని అన్నారు. తోట‌ప‌ల్లి ప్రాజెక్టుతో ల‌క్ష‌కు పైగా ఎక‌రాల‌కు నీళ్లిచ్చామ‌ని చెప్పారు.

సాగునీటి ప్రాజెక్టులు పూర్త‌యితే రాయ‌ల‌సీమ మ‌రింత అభివృద్ధి చెందుతుంద‌ని చంద్రబాబు చెప్పారు. రాయ‌ల‌సీమ‌లోనూ ఏక‌ప‌క్ష ఫ‌లితాలు వ‌స్తున్నాయని చెప్పారు. తాను చేస్తోన్న మంచి ప‌నుల‌కు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు అడ్డుత‌గులుతున్నార‌ని అన్నారు. ప్రతిపక్ష నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. వారి తీరును ప్రజలు గమనిస్తున్నారని, అందుకే ప్రజలు తమకే మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఎన్ని ఎన్నికలు జరిగినా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

More Telugu News