MSNBC: న్యూస్ చదువుతూ ఉంటే డిస్టర్బ్ చేశారని రెచ్చిపోయి తిట్లదండకం మొదలు పెట్టిన యాంకర్... వీడియో చూడండి!

  • రాయడానికి వీల్లేనంతగా తిట్లకు దిగిన ఎంఎస్ ఎన్బీసీ చానల్ యాంకర్
  • ఆపై క్షమాపణలు చెప్పిన వైనం

ఎంఎస్ ఎన్బీసీ చానల్ ప్రసారం చేసే 'లాస్ట్ వర్డ్' యాంకర్ లారెన్స్ ఓ డానెల్ సహనాన్ని కోల్పోయాడు. తాను న్యూస్ చదువుతూ ఉంటే గుసగుసలాడుకున్న వారిని ఉద్దేశించి రాయడానికి వీలు లేనంతగా తిట్ల దండకానికి దిగాడు. తన ఇయర్ ఫోన్ లో ఏదో శబ్దాలు వినిపించేసరికి తీవ్ర ఆగ్రహానికి గురైన లారెన్స్, కెమెరా సిబ్బందిపై నిప్పులు చెరిగాడు. కంట్రోల్ రూములో కూర్చున్న వాళ్లెవరో కంట్రోల్ తప్పిపోయారని, సుత్తి కొట్టడం ఆపాలని కేకలు పెట్టాడు. తాను వార్తలు చదవలేకపోతున్నానని అరుస్తూ, తిట్లకు దిగాడు.

తన కోపం తగ్గేదాకా కమర్షియల్ బ్రేక్ కొనసాగించాలని అరిచాడు. ఎవరో అమ్మాయి ఈ షో తరువాత ఏం చేద్దామని కబుర్లు చెబుతోందని, ఆమె కావాలంటే ఇప్పుడే ఆ పని చేసుకోవచ్చని అన్నాడు. సుమారు 8 నిమిషాల పాటు కొనసాగిన ఈ వీడియోను మీడియా వాచ్ వెబ్ సైట్ 'మీడియేట్' వెలుగులోకి తీసుకువచ్చింది. ఇది వైరల్ కావడంతో లారెన్స్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా క్షమాపణలు కోరాడు. సాంకేతిక సమస్యలు తనను వేధించినందున అలా ప్రవర్తించానని, అందుకు క్షమాపణలు కోరుతున్నానని తెలిపాడు. రెచ్చిపోయి కేకలేస్తున్న లారెన్స్ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News