love: ఉదయం పెళ్లి చేసుకుని, సాయంత్రానికి అసువులు బాసిన బీటెక్ ప్రేమజంట... ప్రకాశం జిల్లాలో పెను కలకలం!

  • గత కొంతకాలంగా ప్రేమలో సందీప్, మౌనిక
  • మంగళవారం విజయవాడలో వివాహం 
  • పెద్దలకు చెబితే 'ససేమినా' అన్న సమాధానం
  • ఆపై రైలు కిందపడి ఆత్మహత్య

ఇద్దరూ బీటెక్ చదువుతున్న వారే. కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. మంగళవారం ఉదయం విజయవాడలో వివాహం చేసుకున్నారు. ఆ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పారు. రెండు కుటుంబాలూ ససేమిరా అనడంతో మనస్తాపం చెంది రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలాన్ని రేపింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన కరణం సందీప్‌ (22), గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరుకు చెందిన గోగిరెడ్డి మౌనిక (21)లు కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. వివాహం చేసుకుందామని నిర్ణయించుకుని చీరాల రైల్వే స్టేషన్ లో కలుసుకున్నారు. ఆపై విజయవాడకు వెళ్లి ఒక్కటయ్యారు.

విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా, వారు సానుకూలంగా స్పందించలేదు. జరిగిన విషయాన్ని తిమ్మసముద్రంలోని తన మిత్రుడు సందీప్ కు మెసేజ్ పెట్టి, తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సందీప్ చెప్పాడు. ఆపై ఇద్దరూ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నిండగా, వారు స్నేహితుల్లా ఉన్నారని అనుకున్నామే తప్ప, ఇంతగా ప్రేమలో ఉన్నారని తెలియలేదని తల్లిదండ్రులు వాపోయారు.

More Telugu News