tirumala: తిరుమలలో గంటలోపే స్వామి దర్శనం!

  • గణనీయంగా తగ్గిన భక్తుల రద్దీ
  • ప్రతి ఒక్కరి దృష్టీ బ్రహ్మోత్సవాలపైనే
  • ఎల్లుండి నుంచి ప్రారంభం

తిరుమలలో రద్దీ గణనీయంగా తగ్గింది. ఎల్లుండి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనుండటంతో భక్తుల రాక తగ్గిందని తెలుస్తోంది. నిత్యమూ రద్దీగా ఉండే ఏడుకొండలూ ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఉచిత దర్శనానికి కేవలం గంట సమయం మాత్రమే పడుతోంది. కాలినడక భక్తులు, రూ. 300 ప్రత్యేక దర్శనం క్యూలైన్లు భక్తులు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైనందున, ఎల్లుండి నుంచి భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్న టీటీడీ, బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది.

భక్తుల డిమాండ్ కు తగ్గట్టుగా లడ్డూ ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే అసంఖ్యాక భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూసేందుకు అన్ని ఆర్జిత సేవలనూ రద్దు చేశామని వెల్లడించారు. కాగా, 23 సాయంత్రం ధ్వజారోహణంతో తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, అదే రోజు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఆపై పెద్ద శేషవాహనంపై స్వామివారిని ఉంచి మాఢ వీధుల్లో తొలి వాహన సేవను నిర్వహిస్తారు.

More Telugu News