nabha jail: కోటి రూపాయలు తీసుకుని గ్యాంగ్ స్టర్ ను వదిలేసిన యూపీ ఐపీఎస్ అధికారి!

  • గంటల వ్యవధిలో డీల్ కుదిర్చిన పొలిటీషియన్
  • స్పాట్ క్యాష్ గా రూ. 45 లక్షలు
  • మీడియాలో గుప్పుమన్న వార్తలు
  • విచారణకు సీఎం ఆదిత్యనాథ్ ఆదేశాలు

పంజాబ్ లోని నభా జైలు గోడలను బద్దలు కొట్టి పారిపోయిన కేసులో ఉగ్రవాదులతో పాటు నిందితుడిగా ఉన్న ఓ గ్యాంగ్ స్టర్ ను అరెస్ట్ చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు, ఆపై గంటల వ్యవధిలో కోటి రూపాయలకు డీల్ కుదుర్చుకుని అతన్ని వదిలివేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన లేనప్పటికీ, మీడియాలో వార్తలు రావడంతో ఉన్నత స్థాయి విచారణకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు.

లక్నోలో ఇనెస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి ఈ మొత్తం పథకానికి సూత్రధారని అనుమానాలు ఉన్నాయి. ఆయన నేతృత్వంలోని సిట్ టీమ్, నభా జైలు నుంచి పారిపోయిన గురుప్రీత్ సింగ్ అలియాస్ గోపీ ఘన్ శ్యామ్ పురాను ఈ నెల 10న షాహజహాన్ పూర్ లో అరెస్ట్ చేయగా, ఆ వెంటనే ఓ స్థానిక కాంట్రాక్టర్, ఫిలిబిత్ కు చెందిన రాజకీయ నాయకుడు ఒకరు రంగ ప్రవేశం చేసి, రూ. కోటికి డీల్ కుదుర్చుకుని, స్పాట్ క్యాష్ గా రూ. 45 లక్షలు అప్పగించి, అతన్ని విడిపించుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో హోం శాఖ విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని ఆదిత్యనాథ్ ఆదేశించారు. కాగా, నవంబర్ 2016లో నభా జైలు నుంచి ఆరుగురు తప్పించుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News