telangana: అబ్బాయిలతో మాట్లాడిందని కూతురిని సజీవదహనం చేసిన తండ్రి... తెలంగాణలో పరువు హత్య కలకలం!

  • నల్గొండ జిల్లాలో ఘటన
  • అబ్బాయిలతో తిరుగుతోందని తండ్రికి అనుమానం
  • భార్యతో కలసి కూతురిని మట్టుబెట్టిన కసాయి తండ్రి
  • పోలీసుల విచారణతో విషయం బట్టబయలు

తెలంగాణలోని నల్గొండ జిల్లా తీదేడు గ్రామంలో జరిగిన పరువు హత్య కలకలం రేపింది. తన 13 ఏళ్ల కుమార్తె, అబ్బాయిలతో మాట్లాడుతూ, కలివిడిగా తిరుగుతోందని భావించిన ఓ తండ్రి, ఆమెను సజీవదహనం చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి, పోలీసుల విచారణలో దొరికిపోయాడు.

 మరిన్ని వివరాల్లోకి వెళితే, రాధిక 7వ తరగతి చదువుతోంది. ఆమె చదువులో మిగతా వారికన్నా మెరుగైన ప్రతిభను చూపుతుండేది. పాటలు ఎంతో ఇష్టంగా, స్వరబద్ధంగా పాడే రాధికంటే అందరికీ అభిమానం. అందుకు తగ్గట్టుగానే క్లాస్ మేట్స్ తో కలివిడిగా ఉంటుంది. మంగళవారం నాడు ఆమె తన సహ విద్యార్థితో మాట్లాడుతూ ఉండగా తండ్రి నరసింహ చూశాడు. రాధిక ఇంటికి వెళ్లిన తరువాత, ఇంటికి చెడ్డపేరు తెస్తున్నావని తిడుతూ కొట్టాడు.

రాధిక తలను గోడకేసి బలంగా బాదడంతో గాయమైంది. ఆపై తన భార్య లింగమ్మతో కలసి, రాధిక ఒంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టాడు. తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని చెప్పి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తుండగా, ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చీ రావడంతోనే దీన్ని హత్యగా అనుమానించారు. తమదైన శైలిలో విచారించగా, తల్లిదండ్రులు నేరాన్ని అంగీకరించారని, వారిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. తన కుమార్తె అవాంఛిత కార్యకలాపాలకు పాల్పడుతూ పరువు తీస్తోందన్న కారణంతోనే ఆమెను హత్య చేశానని, ఇందుకు బాధపడటం లేదని నరసింహ చెబుతుండటం గమనార్హం.

More Telugu News