oneplus: భార‌త్‌లో ఉత్త‌మ మొబైల్ ఫోన్‌గా నిలిచిన వ‌న్‌ప్ల‌స్‌... స‌ర్వేలో వెల్ల‌డి

రెండేళ్ల క్రితం భార‌త మార్కెట్‌లోకి వ‌చ్చిన చైనా కంపెనీ మొబైల్ వ‌న్‌ప్లస్‌ను వినియోగ‌దారులు ఉత్త‌మ మొబైల్ ఫోన్‌గా గుర్తించిన‌ట్లు ఓ స‌ర్వేలో తేలింది. అందుబాటు ధ‌ర‌ల్లోనే అన్ని ర‌కాల‌ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్లను అందిస్తున్న వ‌న్‌ప్ల‌స్ మొబైళ్ల‌ను ఎక్కువ మంది వినియోగ‌దారులు కొన‌డానికి మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ నుంచి వ‌చ్చిన వ‌న్‌ప్ల‌స్ 3, వ‌న్‌ప్ల‌స్ 3టీ, వ‌న్‌ప్ల‌స్ 5 మోడ‌ళ్ల‌కు భార‌త్‌లో మంచి పేరుంద‌ని స‌ర్వే వెల్ల‌డించింది.

 సైబర్ మీడియా రీసెర్చ్ నిర్వ‌హించిన మొబైల్ ఇండ‌స్ట్రీ క‌న్స్యూమ‌ర్ ఇన్‌సైట్ స‌ర్వేలో ఈ విష‌యాలు తెలిశాయి. వినియోగ‌దారుల‌ను సంతృప్తి ప‌రిచే విష‌యంలో ఆపిల్ ఫోన్ల కంటే వ‌న్‌ప్ల‌స్ ఫోన్ల‌కే ఎక్కువ మంది మంచి రేటింగ్ ఇచ్చిన‌ట్లు స‌ర్వే పేర్కొంది. ఆపిల్, శాంసంగ్ వంటి ఫోన్ల‌కు అమ్మ‌కాలు బాగానే ఉన్నా వ‌న్‌ప్ల‌స్ ఫోన్ల‌తో పోల్చిన‌పుడు క‌స్ట‌మ‌ర్ల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డంలో అవి వెన‌కబ‌డ్డాయ‌ని సైబ‌ర్ మీడియా తెలిపింది. మ‌రో ప‌క్క బ్రాండ్ లాయ‌ల్టీ విష‌యంలో మాత్రం ఆపిల్ ప్ర‌థ‌మ స్థానంలో ఉంద‌ని వారు చెప్పారు. మొబైల్‌ నాణ్య‌త‌, ధ‌ర‌, ప‌నితీరు, స‌ర్వీసు విష‌యాల్లో ఈ స‌ర్వే నిర్వ‌హించారు.

More Telugu News