modi: అమ్మ ఆశీర్వాదం కోసం తరలిన ప్రధాని నరేంద్ర మోదీ

  • 67వ పడిలోకి అడుగు పెట్టిన మోదీ
  • గుజరాత్ లో జరిగే వేడుకల్లో స్వయంగా పాల్గొననున్న ప్రధాని
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఘనంగా సాగనున్న మోదీ పుట్టినరోజు పండగ
  • వారణాసిలో యూపీ సీఎం యోగి ప్రత్యేక కార్యక్రమాలు

నేడు 67వ పడిలోకి అడుగు పెట్టనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, తన తల్లి ఆశీర్వాదం తీసుకోనున్నారు. గత రాత్రే అహ్మదాబాద్ చేరుకున్న ఆయన, నేడు కాసేపు తల్లితో గడపనున్నారు. ఆయన తల్లి హీరాబా, ప్రస్తుతం మోదీ సోదరుడు పంకజ్ తో కలసి ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. ఆపై గుజరాత్ లో నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగే వేడుకల్లో స్వయంగా పాల్గొంటారు. అక్కడి నుంచి వడోదరకు వెళ్లి సర్దార్ సరోవర్ ఆనకట్టను జాతికి అంకితం చేసి, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.

సాధుబెట్ వద్ద వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహ స్థలాన్ని, జరుగుతున్న పనులను పరిశీలించనున్నారని అధికారులు తెలిపారు. అనంతరం దబోయ్ చేరుకుని అక్కడ జరిగే సహకార సమ్మేళనం కార్యక్రమంలో నరేంద్ర మోదీ పాల్గొంటారు. గత మూడు వారాల వ్యవధిలో మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటించడం ఇది మూడో సారి.

కాగా, మోదీ పుట్టిన రోజు వేడుకలను వైభవంగా జరిపేందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. యూపీలో పెద్దఎత్తున వేడుకలు సాగనున్నాయి. మోదీ పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో జరిగే పుట్టిన రోజు కార్యక్రమాల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ లక్నో విధానసభ ముందు ఏర్పాటు చేసిన 110 అడుగుల భారీ కటౌట్ అందరినీ ఆకర్షిస్తోంది.

More Telugu News