jupudi: చంద్రబాబు నన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకున్నారు... కానీ, తప్పు నాదే: జూపూడి ప్రభాకర్

హైదరాబాద్ లో ఓటు ఉండటంతో ఎమ్మెల్సీ కాలేకపోయానన్న జూపూడి

చంద్రబాబు నాకు మంచి చేయాలనుకున్నారు

ఓటును సొంతూరుకు మార్చుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు

జీవన్మరణ సమస్యలా అనిపించింది


ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు సరైన అవకాశాన్ని ఇవ్వాలని అనుకున్నప్పటికీ, తన ఓటు హక్కు హైదరాబాదులో ఉండటంతో ఎమ్మెల్సీ అయ్యే అవకాశాన్ని కోల్పోయానని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ చెప్పారు. అంతకు ముందు ఇదే ఓటుతో కొండెపిలో పోటీ చేశానని... రాష్ట్రం విడిపోవడంతో సమస్య వచ్చిందని తెలిపారు. తన ఓటును సొంతూరుకి మార్చుకోవాలనే ఆలోచన కూడా తనకు రాలేదని చెప్పారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూపూడి ఈ విషయాలను వెల్లడించారు.

ఎమ్మెల్సీకి తనను చంద్రబాబు నామినేట్ చేశారని... మరుసటి రోజు ఉదయం నామినేషన్ వేయాల్సిన తరుణంలో, ఆ రాత్రి పార్టీకి చెందిన ఓ నేత మీ ఓటు ఎక్కడుందంటూ తనను అడిగారని... అబద్ధం చెప్పడం అలవాటు లేని తాను, నిజమే చెప్పానని జూపూడి తెలిపారు. అంతలోనే ఈ విషయం మీడియాలో వచ్చేసిందని చెప్పారు. ఉదయం చంద్రబాబును కలిసినప్పుడు... 'ఇదేదో సమస్యగా తయారైంది కదమ్మా, తరువాత చూద్దాంలే' అని అన్నారని తెలిపారు. ఆయన సింపుల్ గా చెప్పారని... తనకేమో జీవన్మరణ సమస్యలా అనిపించిందని చెప్పారు. టీడీపీలో తాను చేరినప్పుడు పార్టీ నేతలందరి సమక్షంలో జూపూడిని ఉన్నత స్థాయికి తీసుకెళతానంటూ చంద్రబాబు చెప్పారని... చెప్పినట్టుగానే తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని... కానీ, పొరపాటు తనదేనని చెప్పారు. అయినప్పటికీ తనకు ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని చంద్రబాబు ఇచ్చారని చెప్పారు.

ఓ న్యూస్ ఛానల్ డిస్కషన్ లో ఓ పెద్ద మనిషి మాట్లాడుతూ, 'ఏమయ్యా ఉదయం నుంచి అంబేద్కర్ పుస్తకం పట్టుకుని తిరుగుతుంటావు, నీకు ఓటు ఎక్కడుందో కూడా తెలియదా?' అని ప్రశ్నించారంటూ నవ్వుతూ చెప్పారు. 

More Telugu News