guntur: ఆమెను చంపుతావా? నిన్ను చంపమంటావా?: హత్య చేయాలని బెదిరిస్తున్నారని స్టేషన్ కు తుపాకితో వచ్చిన గుంటూరు వ్యక్తి!

  • గుంటూరు పోలీసులను ఆశ్రయించిన మోదుగుల విజయభాస్కరరెడ్డి
  • శంకర్ రెడ్డి అనే అతను నిర్వహిస్తున్న యోగా సెంటర్ లో అక్రమాలు
  • మహిళలతో మసాజ్, వ్యభిచారం నిత్యకృత్యం
  • విచారణకు ఆదేశించిన పోలీసు అధికారులు

తనను హత్య చేయాలని పురికొల్పుతూ స్కూటీతో పాటు తుపాకీని కూడా ఇచ్చాడని చెబుతూ గుంటూరుకు చెందిన మోదుగుల విజయభాస్కరరెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కు తుపాకి తీసుకురావడం తీవ్ర కలకలం రేపింది. కొందరు న్యాయవాదులతో కలసి వచ్చిన ఆయన, తుపాకిని పోలీసులకు ఇచ్చి, తనకు ఎదురైన అనుభవంపై ఓ లేఖను అందించారు. ఆ లేఖ లోని వివరాల ప్రకారం, విజయభాస్కరరెడ్డి, శనగా సోమశంకర్ లు కలసి వ్యాపారం చేస్తున్నారు. కొంత కాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న విజయభాస్కరరెడ్డి, సోమశంకర్ నిర్వహిస్తున్న శంకర్ హోలిస్టిక్ యోగా కేంద్రంలో చేరారు.

శంకర్ రెండో భార్య రమాదేవి మహిళా కానిస్టేబుల్. ఆమె ద్వారా యోగా కేంద్రంలో నిత్యమూ వ్యభిచారం జరుగుతూ ఉంటుంది. మహిళలతో పురుషులకు మసాజ్ లు చేయించి, వాటిని వీడియోలు తీసి, ఆపై బాధితులను బెదిరించి డబ్బులు గుంజుతుంటారు. ఈ తతంగాన్ని చూసిన విజయభాస్కరరెడ్డి, యోగా సెంటర్ కు వెళ్లడం మానేశాడు. శంకర్ తో చనువుగా ఉన్న ఓ మహిళకు ఈ విషయం చెప్పి, అమెను కూడా యోగా సెంటర్ కు వెళ్లవద్దని చెప్పడంతో ఆయనకు కోపం వచ్చింది. ఆ సమయంలో విజయభాస్కరరెడ్డిని హత్య చేస్తానని శంకర్ బెదిరించాడు.

మరోపక్క, గతంలో శంకర్ నుంచి రుణం తీసుకుని, ఆ డబ్బు చెల్లించలేక ఇంటిని వదులుకున్న చలసాని ఝాన్సీ అనే మహిళ, శంకర్ పై కాల్ మనీ, అత్యాచారం కేసులను పెడుతోంది. ఆమెను హత్య చేయాలని కోరుతూ జూన్ లో తుపాకిని, స్కూటీని విజయభాస్కరరెడ్డికి ఇచ్చాడు. ఇప్పుడు తనకు తప్పు తెలిసిందని, అందుకే లొంగిపోయేందుకు వచ్చానని, తనకు శంకర్ నుంచి ప్రాణహాని ఉందని వాపోయాడు. ఈ లేఖను తీసుకున్న పోలీసులు, మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని నిర్ణయించారు.

More Telugu News