: భారత్, అమెరికాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంతో బెంబేలెత్తుతున్న పాక్

  • 22 ప్రిడేటర్ల కొనుగోలుకు గత జూన్ లో అమెరికాతో భారత్ ఒప్పందం
  •  భారత్, పాక్ ల మధ్య వ్యూహాత్మక బలం సమస్థాయిని కోల్పోయిందని విమర్శ 
  • భారత్ బలపడుతోందని పాక్ ఆందోళన

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందనే కారణాలతో పాకిస్థాన్ పై అమెరికా కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశానికి ఎంతో కాలంగా అందిస్తున్న ఆర్థిక సాయాన్ని కూడా నిలిపేసింది. తాజాగా భారత్ కు అమెరికా చాలా సన్నిహితంగా వ్యవహరిస్తుండటం పాక్ కు మింగుడుపడటం లేదు. అత్యున్నత సాంకేతికతతో తయారైన 22 ప్రిడేటర్ డ్రోన్లను భారత్ కు విక్రయించేందుకు అమెరికా ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ డ్రోన్లు రక్షణ వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాయి. అంతేకాదు, భారత సబ్ మెరైన్లకు అనుసంధానంగా ఇవి పనిచేస్తాయి. దీంతో, వీటి గురించి పాకిస్థాన్ బెంబేలెత్తిపోతోంది.

ఇదే విషయంపై పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా ఆందోళన వ్యక్తం చేశారు. గత జూన్ లో అమెరికాతో భారత ప్రధాని మోదీ అత్యంత కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని... జలాంతర్గాముల కోసం ఉపయోగించే 22 డ్రోన్లకు సంబంధించి ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ ఒప్పందంతో భారత్, పాక్ ల మధ్య వ్యూహాత్మక బలం సమస్థాయిని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. ఈ డ్రోన్లతో భారత బలం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బ్యాలెన్స్ తప్పితే, దక్షిణాసియాలో సుస్థిరత్వానికి ప్రమాదం ఏర్పడుతుందని చెప్పారు.

More Telugu News