: జగన్ అక్రమాస్తులను ప్రభుత్వానికి ఇచ్చేయాలి: చంద్రబాబు

  • జగన్ నిజాయతీ నిరూపించుకోవాలన్న చంద్రబాబు
  • 2004 తర్వాత సంపాదించిన ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చేయాలి
  • జగన్ కంటే అగ్రిగోల్డ్ లాంటి సంస్థలే బెటర్

వైసీపీ అధినేత జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని అడ్డు పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తులను ప్రభుత్వానికి జగన్ ఇచ్చేయాలని అన్నారు. 2004 నాటికి ఆయన వద్ద ఉన్న ఆస్తులను ఉంచుకుని... ఆ తర్వాత సంపాదించిన ఆస్తులను అప్పగించాలని తెలిపారు. జగన్ తెలివైనవాడు కనుక... 2004 వరకు ఆయన వద్ద ఉన్న ఆస్తులతో వ్యాపారం చేస్తే... ఓ 20 శాతం సంపాదించగలనని ఆయన అనుకుంటే... ఆ 20 శాతాన్ని కూడా అదనంగా ఉంచుకుని, మిగిలినదాన్ని ప్రభుత్వ పరం చేయాలని సూచించారు. అలా చేస్తే, జగన్ నిజాయతీ ప్రజలకు అర్థమవుతుందని చెప్పారు. ఏపీలో తప్పుడు పనులు, మోసాలు చేసే వారికి స్థానం లేదని అన్నారు. జగన్ కంటే అగ్రిగోల్డ్ లాంటి సంస్థలే బెటర్ అని... వాటి ఆస్తులను అమ్మైనా డిపాజిట్ దారులకు న్యాయం చేయవచ్చని అన్నారు.

ఏపీలో ప్రతిపక్షమే లేకుండా చేస్తామని తాను ఎన్నడూ అనలేదని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని 80 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉండాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. 80 శాతం మంది ప్రజలు ఆనందంగా ఉంటే, వారి ఓట్లు టీడీపీకే పడతాయని... అలాంటప్పుడు ఇతర పార్టీకి అవకాశం ఎక్కడ ఉంటుందని అన్నారు.

More Telugu News