: హ్యాక్‌కు గురైన ర్యాన్ గ్రూప్ వెబ్‌సైట్‌... చిన్నారి ప్ర‌ద్యుమ‌న్‌కి నివాళి అర్పించిన హ్యాక‌ర్లు

పాఠ‌శాల నిర్ల‌క్ష్యం కార‌ణంగా అసువులు బాసిన చిన్నారి ప్ర‌ద్యుమ‌న్ ఠాకూర్‌కి హ్యాక‌ర్లు నివాళి అర్పించారు. ర్యాన్ స్కూల్స్‌కి సంబంధించిన ర్యాన్ గ్రూప్ వెబ్‌సైట్‌ని వారు హ్యాక్ చేశారు. `టీం కేర‌ళ సైబ‌ర్ వారియ‌ర్స్‌`గా హ్య‌క‌ర్లు త‌మ‌ను ప‌రిచ‌యం చేసుకున్నారు. గుర్గావ్‌లోని ర్యాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లో హ‌త్య‌కు గురైన ప్ర‌ద్యుమ‌న్ ఠాకూర్ ఫొటోను వారు వెబ్‌సైట్ హోం పేజీలో కనిపించేలా ఉంచారు. ఆ ఫొటో కింద `నువ్వు వెళ్లిపోయి ఉండొచ్చు. కానీ నిన్ను ఎప్ప‌టికీ మ‌ర్చిపోం` అనే సందేశాన్ని హ్యాక‌ర్లు ఉంచారు.

అలాగే ర్యాన్ స్కూల్ యాజ‌మాన్యాన్ని నిలదీస్తూ ఓ సందేశాన్ని కూడా హ్యాక‌ర్లు అందించారు. `విద్యార్థుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో మీరు చూపించిన నిర్ల‌క్ష్యం వ‌ల్ల చ‌నిపోయిన విద్యార్థికి మీరు చేయ‌గ‌ల న్యాయం ఏంటని భార‌త ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. విద్య అనేది మీకు వ్యాపారం కావొచ్చు. విద్యార్థుల ర‌క్ష‌ణ కోసం మీరు తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు ఏంటి?` అని హ్యాక‌ర్లు సందేశంలో అడిగారు. అలాగే ప‌నిచేయ‌ని సీసీ కెమెరాలు, ఉద్యోగం ఇచ్చేముందు అభ్య‌ర్థుల నేప‌థ్యం ఆరా తీయ‌క‌పోవ‌డం, డ్రైవ‌ర్లు, కండ‌క్ట‌ర్ల‌ని పాఠ‌శాల లోప‌లికి అనుమతివ్వడం, పిల్ల‌ల వాష్ రూంల‌ను ఇత‌రుల‌ను వాడుకోనివ్వ‌డం.. వంటి ప‌నులను హ్యాక‌ర్లు పేర్కొన్నారు.

More Telugu News