: కేసీఆర్ దెబ్బకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ఎండిపోయాయి: కోమటిరెడ్డి ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఓ ఐరన్ లెగ్ అని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్ లు ఎండిపోయాయని విమర్శించారు. టీఆర్ఎస్ పాలన వచ్చి మూడేళ్లు దాటినా తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు. తన నియోజకవర్గం గజ్వేల్ లో జరిగిన అభివృద్ధినే తెలంగాణ అభివృద్ధిగా పేర్కొంటూ... జనాల చెవుల్లో కేసీఆర్ పువ్వులు పెడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలన రజాకార్ల పాలనను తలపిస్తోందని చెప్పారు.

కేసీఆర్ కు వాస్తు పిచ్చి పట్టుకుందని... అందుకే ప్రతిదానికి వాస్తు అంటున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. అక్టోబర్ 2వ తేదీ లోపు నల్గొండకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని... లేకపోతే, తాను 72 గంటల నిరవధిక నిరాహారదీక్ష చేపడతానని హెచ్చరించారు. గ్రామాలలోని ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికే... రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాము పార్టీ మారడం లేదని... కాంగ్రెస్ లోనే ఉండి పోరాడతామని చెప్పారు.

More Telugu News