: షాకింగ్... గుర్మీత్ డేరాలో 'విషకన్యలు'... చేసేదంతా వీరేనట!

తన ఆశ్రమంలో ఉన్న సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో 20 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ గురించి, ఆయనకు శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించిన గురుదాస్ సింగ్ మరిన్ని సంచలనాత్మక వివరాలను బయటపెట్టాడు. ఆయన ఆశ్రమంలో 'విషకన్యలు' అనే పేరిట ఓ గ్రూప్ ఉండేదని చెప్పాడు. గుర్మీత్ కోసం అందమైన అమ్మాయిలను ఎంపిక చేయడం నుంచి వారిని ప్రలోభాలకు గురిచేసి ఆయన వద్దకు పంపడం, అంగీకరించని వారిని విపరీతంగా హింసించడం, అయినా వినకుంటే కఠిన శిక్షలు విధించడం వీరి పనని తెలిపారు.

డేరాలో ఉండే యువతులకు, బాబా ఆశీర్వాదం లభిస్తే పవిత్రులై పోతారని మాయమాటలు చెప్పి వారిని ఆయన మందిరానికి ఈ విషకన్యలు చేరుస్తారని, ఎదురు తిరగకుండా ముందుగానే వారికి అన్ని విషయాలూ చెబుతారని, ఎవరైనా అంగీకరించకుంటే తమ నిజ స్వరూపాన్ని వీరు బయట పెడతారని గురుదాస్ పోలీసులకు చెప్పారు. వారికి ఆహారం ఇవ్వకుండా, కుర్చీలకు కట్టేసి కొట్టేవారని, ముఖానికి మసిపూసి, డేరా అంతా గాడిదలపై ఊరేగించేవారని చెప్పారు. కాగా, ఇప్పటివరకూ ఈ గ్రూప్ లోని మహిళలపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలుస్తోంది.

More Telugu News