: రెండేళ్ల నాడు కల్బుర్గీని హత్య చేసిన తుపాకితోనే గౌరీ లంకేశ్ హత్య... కీలక ఆధారం అందించిన ఫోరెన్సిక్!

కర్ణాటకలో దారుణ హత్యకు గురైన జర్నలిస్టు గౌరీ లంకేశ్ కేసులో కీలక ఆధారం ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి లభించింది. రెండు సంవత్సరాల క్రితం కన్నడ స్కాలర్ ఎంఎం కల్బుర్గీని హత్య చేసిన తుపాకీతోనే గౌరీని కూడా కాల్చి చంపినట్టు దర్యాఫ్తులో వెల్లడైనట్టు సమాచారం. నాడు కల్బుర్గీని 7.65 ఎంఎం కాలిబర్ స్వదేశీ పిస్టల్ తో కాల్చి చంపగా, గౌరీని సైతం అదే పిస్టల్ తో హత్య చేశారని, రెండు ఆయుధాల మధ్యా 80 శాతం సారూప్యత ఉందని ఫోరెన్సిక్ వర్గాలు చెబుతున్నాయి. తమ ప్రాథమిక నివేదికను నేడు సిట్ కు అందిస్తామని, రెండు హత్యల్లోనూ ఒకే ముఠా పాల్గొని ఉండవచ్చని అనుమానిస్తున్నామని తెలిపాయి. కాగా, ఈ కేసులో ఇప్పటివరకూ 80 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు, గౌరీని మావోలు కాల్చి చంపి ఉండవచ్చని ఓ నిర్దారణకు వచ్చినట్టు సమాచారం.

More Telugu News