: నిధుల కోసం సైబ‌ర్ దాడుల‌కు పాల్ప‌డుతున్న ఉత్త‌ర కొరియా

అణుప‌రీక్ష‌లు చేస్తూ ప్ర‌పంచ దేశాల‌ను భ‌య‌పెడుతున్న ఉత్త‌ర కొరియాపై ఆంక్ష‌ల ప‌ర్వం పెరిగిపోతున్న కార‌ణంగా నిధుల స‌మీక‌ర‌ణ కోసం సైబ‌ర్ దాడుల‌ను ఎంచుకుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బిట్‌కాయిన్ వంటి వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ కేంద్రీకృతంగా ఈ దాడులు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ద‌క్షిణ కొరియాకు చెందిన మూడు వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ ఎక్స్‌ఛేంజీల‌పై ఉత్త‌ర కొరియా హ్యాక‌ర్లు సైబ‌ర్ దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు భద్రతా పరిశోధన సంస్థ ‘ఫైర్‌ ఐ’ తెలిపింది.

వీటిలో ఒక దాడి ఫలితంగా సియోల్‌లోని ‘యాపిజాన్‌’లో నాలుగు వ్యాలెట్ల నుంచి 1.5 కోట్ల డాలర్ల విలువైన 3800 బిట్‌కాయిన్లు అపహరణకు గురైన‌ట్లు వారు వెల్ల‌డించారు. అయితే ఈ దాడుల వెనుక ఉత్తర కొరియా ప్ర‌భుత్వ హ‌స్తం ఉందా? అన్న విష‌యం ఇంకా తెలియ‌రాలేదు. గతంలో ఏటీఎంలపై సైబర్‌ దాడుల ద్వారా 8 కోట్ల డాలర్ల నగదును తస్కరించిందని దక్షిణ కొరియా విపక్ష నాయకుడు హా టే క్యుంగ్‌ ఆరోపించారు. ఉత్త‌ర కొరియా సైబ‌ర్ దాడుల‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో అంత‌ర్జాతీయ స‌హ‌కారం కావాల‌ని ఆయ‌న కోరారు.

వ‌ర్చువ‌ల్‌ కరెన్సీల వాడ‌కంలో దక్షిణ కొరియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. అతిపెద్ద వర్చువల్‌ కరెన్సీ మార్పిడి సంస్థగా సియోల్‌లోని ‘బిట్‌హంబ్‌’ ఎదిగింది. ఈ సంస్థపై సైబర్‌ దాడులు కూడా అధికంగానే జరిగాయి. ఈ దాడుల వెనుక ఉత్త‌ర కొరియా ప్ర‌భుత్వ పాత్ర ఉన్న‌ట్టు అనుమానిస్తున్నారు. డిజిటల్‌ కరెన్సీ ఎక్స్‌చేంజీల్లో ఉద్యోగుల వ్యక్తిగత ఈమెయిల్‌ ఖాతాలను లక్ష్యంగా చేసుకొని ఉత్తర కొరియా సైబర్‌ నేరగాళ్లు ‘స్పియర్‌ ఫిషింగ్‌’ దాడులకు పాల్పడ్డారని ‘ఫైర్‌ ఐ’ సంస్థ పేర్కొంది.

More Telugu News