: కావాలనే పక్కన పెడితే ఈ రాద్ధాంతం ఏంటి?: అశ్విన్, జడేజాలపై రవిశాస్త్రి

త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ లో స్పిన్నర్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నవేళ, కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. వారిద్దరూ ప్రతిసారి పూర్తి ప్రతిభతో ఆడలేరని, ప్రపంచకప్ కు మరో రెండేళ్ల సమయం ఉన్నందున, వారికి టెస్ట్ క్రికెట్ లో మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకు మాత్రమే విశ్రాంతి కల్పించామని, జట్టులోకి ఎంపిక చేయకపోవడానికి ఇంతకన్నా పెద్ద కారణం లేదని, దీనిపై రాద్ధాంతం తగదని అన్నాడు.

కాగా, ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేలకు జడేజా, అశ్విన్ లను ఎంపిక చేయలేదన్న సంగతి తెలిసిందే. ఇటీవలి లంక పర్యటనలో వీరిద్దరూ అద్భుతంగా రాణించారు. అయినా వీరి పేర్లు లేకపోవడంతో అభిమానులు తీవ్రంగా స్పందించారు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తీరుపై మండిపడ్డారు. తాము రొటేషన్ విధానంలో ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నామని, వరల్డ్ కప్ కోసం అత్యుత్తమ టీమ్ ను ఎంపిక చేయడమే తమ లక్ష్యమని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, మహ్మద్ అజారుద్దీన్ సహా పలువురు మాజీలు ఎంపిక విధానాన్ని ఖండించిన సంగతి తెలిసిందే.

More Telugu News