: ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకుని పెనమలూరు ఉపాధ్యాయురాలిని లక్షల్లో ముంచేసిన కేటుగాడు!

కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఓ ఉపాధ్యాయురాలితో ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకున్న ఓ కేటుగాడు, ఆమెను నిలువునా ముంచేశాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కానూరుకు చెందిన కడియం శివకామేశ్వరి నూజివీడులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఆమెకు థామ్సన్ అనే వ్యక్తి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు. రెండు వారాల క్రితం థామ్సన్ ఫోన్ చేసి రూ. 41 లక్షల విలువైన ఆభరణాలు బహుమతిగా రాగా పంపుతున్నానని కామేశ్వరికి ఫోన్ చేశాడు.

స్థానిక చార్జీలను చెల్లించి వాటిని తీసుకోవాలని చెప్పాడు. ఆపై ఢిల్లీకి చెందిన ఎలైడ్ కొరియర్ సర్వీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెబుతూ ఆమెకు ఫోన్ వచ్చింది. ఆమె పేరిట కొరియర్ వచ్చిందని, దాన్ని తీసుకోవాలంటే రూ. 8.52 లక్షలు కట్టాలని వారు కోరారు. దాన్ని గుడ్డిగా నమ్మిన ఆమె, రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలు, ఓ ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలో మొత్తం డబ్బునూ జమ చేసింది. ఆపై కొరియర్ రాకపోవడం, థామ్సన్ తో మాట్లాడాలని చూస్తే, అతను అందుబాటులో లేకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

More Telugu News