: పాకిస్థాన్‌లో ప్రేమ జంటను మంచానికి కట్టేసి చిత్రహింసలు పెట్టి చంపేసిన వైనం!

ఓ ప్రేమ జంట‌ను మంచానికి కట్టేసి, కరెంట్‌ షాక్‌ ఇచ్చి చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపేసిన ఘ‌ట‌న పాకిస్థాన్‌లోని కరాచీలో చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, జిర్గా కులానికి చెందిన ఓ అమ్మాయి (15), ఓ అబ్బాయి (17) ప్రేమాయ‌ణం కొన‌సాగించారు. అయితే, పెద్దలు త‌మ ప్రేమ‌ను అంగీక‌రించ‌ర‌ని తెలుసుకుని గ‌త నెల ఇంటి నుంచి పారిపోయారు. వారి గురించి గాలించిన వారి కుటుంబ స‌భ్యులు ఎట్ట‌కేల‌కు వారి ఆచూకీ తెలుసుకుని, ఆ జంటను ఇంటికి తీసుకువచ్చారు.

అయితే, ఆ గ్రామానికి చెందిన జిర్గా మత పెద్దలు ఆ ప్రేమ జంటపై విష‌ం క‌క్కారు. వెంటనే వారిద్ద‌రినీ చంపేయాలని ఆదేశించారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామ‌స్తులు చూస్తుండగానే ఆ అమ్మాయిని, అబ్బాయిని మంచానికి కట్టేశారు. అనంత‌రం వారికి కరెంట్‌ షాక్‌ ఇచ్చారు. మొద‌టి రోజు అమ్మాయిని చంపేయ‌గా ఆ త‌రువాతి రోజు అబ్బాయిని చంపేశారు. ఈ ఘ‌ట‌నపై స‌మాచారం అందుకున్న పోలీసులు నిందితుల‌ను అదుపులోకి తీసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.    

More Telugu News