: నాలుగో పెళ్లికి సిద్ధమైన భర్తను అడ్డుకున్న మూడో భార్య!

నిత్య పెళ్లికొడుకును అతని భార్యే స్వయంగా పట్టించిన ఘటన తమిళనాడులో జరిగింది. నాలుగో పెళ్లికి సిద్ధపడిన భర్త బాగోతాన్ని మూడో భార్య బయటపెట్టగా, ఇప్పుడా ప్రబుద్ధుడు కటకటాల వెనకున్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, చెన్నై పరిధిలోని తనికాచలం నగర్ కు చెందిన నందకుమార్ (34) కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతని వివాహం కోసపేటకు చెందిన విజయలక్ష్మి (30) అనే యువతితో నిశ్చయమైంది.

ఆదివారం నాడు పెరంబూరు నుంచి సిరువళ్లూరు వెళ్లే రహదారిలో ఉన్న ఓ కల్యాణ మండపంలో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్న వేళ, కొళత్తూరుకు చెందిన ఉష మండపానికి వచ్చి పెళ్లిని అడ్డుకుంది. తన భర్త నిర్వాకంపై సెబియం పోలీసులకు ఫిర్యాదు చేసి వారిని వెంటబెట్టుకుని వచ్చిన ఉష, ఇప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకుని మోసం చేసిన నందకుమార్, ఇప్పుడు తనకు అన్యాయం చేస్తూ, నాలుగో పెళ్లికి సిద్ధపడ్డాడని గొడవ పెట్టుకుంది. పోలీసులు విచారించగా, తాను ఓ రైల్వే ఉద్యోగిని అని చెప్పే నందకుమార్ పలువురిని పెళ్లి చేసుకుని మోసం చేసినట్టు తేల్చారు. అతన్ని అరెస్ట్ చేసి ఎగ్మోర్ కోర్టులో హాజరు పరిచామని వెల్లడించారు.

More Telugu News