: అమెరికా పిరికిది కాదు, ఎవరూ బెదిరించలేరు: డొనాల్డ్ ట్రంప్

అమెరికన్లు పిరికివారు కాదని, తమ దేశాన్ని ఎవరూ బెదిరించలేరని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారిగా 9/11 యానివర్సరీలో పాల్గొన్న ఆయన, సరిగ్గా పదహారేళ్ల క్రితం సుమారు 3 వేల మంది ప్రాణాలను ఉగ్రవాదులు బలిగొన్నారని గుర్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 11, 2001న దాడులు జరిగిన మూడు ప్రాంతాల్లో ఒకటైన పెంటగాన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని బాధిత కుటుంబ సభ్యులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, అమెరికాకున్న శత్రువులందరినీ తుదముట్టిస్తానని ప్రతిన బూనారు.

 నిన్న తన భార్య మెలానియాతో కలసి వైట్ హౌస్ లో మృతులకు సంతాపం తెలుపుతూ మౌనం పాటించిన ఆయన, ఆపై వరల్డ్ ట్రేడ్ సెంటర్ కుప్పకూలిన ప్రాంతం, గ్రౌండ్ జీరో వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. 16 ఏళ్ల క్రితం అమాయక ప్రజలు ప్రయాణిస్తున్న వాణిజ్య విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులు, వాటితో న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను, అమెరికా సైనిక స్థావర కేంద్రం పెంటగాన్ ను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ వాసి అయిన ట్రంప్, ఆ రోజు నగరంలోనే ఉన్నారు. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న వేళ, పెరల్ హార్బర్ పై జపాన్ భీకర దాడి చేసిన తరువాత, అంతటి తీవ్రత గల దాడిని అమెరికా ఎదుర్కొందని, ఇక భవిష్యత్తులో ఈ తరహా దాడి పునరావృతం కాకుండా చూస్తామని ట్రంప్ అభయమిచ్చారు.

More Telugu News