: నేడు అమెరికాను తాకనున్న ఇర్మా... కనీవినీ ఎరుగని స్థాయిలో బీభత్సం!

కేటగిరీ 5 నుంచి కేటగిరీ 3 స్థాయికి తగ్గి తిరిగి ఉద్ధృతిని పెంచుకున్న ఇర్మా తుపాను ప్రభావం కనీవినీ ఎరుగని స్థాయిలో ఫ్లోరిడాపై ఉంటుందని భావిస్తున్న అమెరికా సర్కారు, 63 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేసింది. నేడు (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8 గంటల సమయం) ఫ్లోరిడా పరిధిలోని కీస్ ప్రాంతంలో గంటకు 250 కిలోమీటర్ల గాలుల తీవ్రతతో తుపాను రానుందని అధికారులు వెల్లడించారు. సముద్రపు అలలు 12 అడుగుల ఎత్తు వరకూ ఎగసి పడతాయని భావిస్తున్నారు. ఫ్లోరిడాలో వేలాది మంది భారతీయులు ఉండటంతో, మన విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. జార్జియా, ఉత్తర, దక్షిణ కరోలినా, అలబామా తదితర రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు.

కాగా, ఈ శతాబ్దకాలంలో చెప్పుకోతగ్గ తుపానులేవీ ఫ్లోరిడాను తాకలేదు. ఇక శనివారం నాడు క్యూబా, బహమాస్ లో ఇర్మా విధ్వంసం కొనసాగింది. ఇర్మా ధాటికి కరేబియన్ దీవుల్లో ఇప్పటివరకూ 25 మంది మృతి చెందారు. చిన్న ద్వీపంగా ఉన్న బార్బుడా లో 95 శాతం ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్యూర్టోరికో, వర్జిన్ ఐలాండ్స్, టర్క్, కైకోస్ ద్వీపాల్లోనూ ఇర్మా విధ్వంసం సృష్టించింది. ఇర్మా నుంచి ప్రజలను రక్షించేందుకు అన్ని రకాల చర్యలనూ తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు.

More Telugu News