: ఇది అత్యంత కిరాతకమైన ఘటన: పాఠశాలలో ఏడేళ్ల చిన్నారి హత్య ఘటనపై హర్యానా సీఎం

దేశ రాజ‌ధాని ఢిల్లీకి స‌మీపంలోని గురుగ్రామ్‌ రేయాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న బాలుడు బాత్రూమ్‌లో దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఇప్ప‌టికే ప‌లువురిని అరెస్టు చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న‌పై స్పందించిన హ‌ర్యానా  సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌... ఇది అత్యంత కిరాతకమైన ఘటన అని అన్నారు. ఈ దారుణానికి పాల్ప‌డిన‌ నిందితుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు చెప్పారు. అధికారుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత కూడా స్పష్టత రాక‌పోతే ఉన్న‌త‌స్థాయి విచారణ చేపట్టేందుకైనా సిద్ధమ‌ని అన్నారు.

కాగా, నిన్న హ‌త్య‌కు గురైన ఆ చిన్నారి ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. ఆ బాలుడి గొంతుపై బలంగా పొడిచినట్లు కత్తిగాట్లు ఉన్నాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి అశోక్‌ కుమార్ అనే బస్సు కండక్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ బాలుడిపై నిందితుడు అస‌హ‌జ లైంగిక చ‌ర్య‌కు పాల్ప‌డే ప్రయత్నం చేసి, అది సాధ్యం కాక‌పోవ‌డంతో ఈ హ‌త్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.     

More Telugu News