: గుంటూరు లోక్ సభ టికెట్ ను విజ్ఞాన్ రత్తయ్య కుమారుడికి జగన్ కన్ఫామ్ చేశారా?

విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత రత్తయ్య కుమారుడు శ్రీకృష్ణదేవరాయలుకు గుంటూరు లోక్ సభ నియోజకవర్గ టికెట్ ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ ఈమేరకు రత్తయ్యకు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా తన తండ్రి ఆశీస్సులతో దేవరాయలు గుంటూరు వైసీపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. వైసీపీ కార్యక్రమాలకు ఆయన హాజరవుతున్నారు. పార్టీ సమన్వయకర్త పేరుతో ఆయన చలామణి అవుతున్నారు.

ఈ క్రమంలో, గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి ఆయన పోటీకి దిగడం ఖాయమని జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేతలు అంటున్నారు. గత ఎన్నికలకు ముందే రత్తయ్య వైసీపీలో చేరారు. అయినా ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. అయినప్పటికీ పార్టీ అభ్యర్థులకు ఆయన ఆర్థికసాయాన్ని అందించారు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే, రాజ్యసభకు పంపిస్తానంటూ అప్పట్లో రత్తయ్యకు జగన్ హామీ ఇచ్చారట. అయితే, వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో, ఆయన ఆశ నెరవేరలేదు. ఇప్పుడు తన కుమారుడిని రంగంలోకి దింపారు.

More Telugu News