: డేరా బాబా మోసంలో ఒక కోణమిది...!

అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఆయన చేసిన ఒక దారుణం వెలుగులోకి వచ్చింది. బల్కారా గ్రామానికి చెందిన సోమవీర్ అనే భక్తుడు 2012లో తన 12 ఎకరాల భూమిని డేరా సచ్చా సౌధాకు దానమిచ్చాడు. ఈ భూమిని ఆశ్రమానికి వినియోగిస్తాడని బాబాకు ఇస్తే...అతను దానిని మరో వ్యక్తికి విక్రయించాడు. దీంతో సోమవీర్ నేరుగా బాబాను కలిసి తన ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో బాబా తన హోటల్ లో భాగస్వామిని చేస్తానని మాటఇచ్చాడు. అనంతరం హోటల్ లో భాగస్వామ్యం ఇస్తున్నాను కదా... హోటల్ నిర్మాణానికి నిధులు కావాలి అని అడిగాడు.

దీంతో 2014లో తన 25 ఎకరాల భూమిని విక్రయించగా వచ్చిన 3.10 కోట్ల రూపాయలను బాబా చేతిలో పోశాడు. ఆ మొత్తం తీసుకున్న తరువాత ఆ హోటల్ లో వాటా ఇచ్చేందుకు నిరాకరించాడు. డేరా ఆశ్రమంలోనే ఉండి, సౌకర్యాలు వినియోగించుకోవాలని సూచించాడు. కొంత కాలం డేరా బాబా ఆశ్రమంలోనే ఉన్న సోమవీర్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. దీంతో డేరా బాబా అరెస్టు తరువాత గత బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రెండు రోజులు వెతికిన అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నేటి ఉదయం గతంలో ఆశ్రమానికి విరాళంగా ఇచ్చిన భూమిని కొనుగోలుచేసిన వ్యక్తి తన పోలానికి నీరు పెట్టేందుకు వెళ్లగా, ఆ బావిలో సోమవీర్ శవమై కనిపించాడు. 

More Telugu News