: మరిన్ని చిక్కుల్లో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్!

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను మరిన్ని కష్టాలు చుట్టుముట్టనున్నాయి. పనామా పేపర్ల వ్యవహారంలో ఆయన పేరు వెలుగు చూడడంతో జూలైలో ఆయన ప్రధాని పదవికి తగరని ఆ దేశ సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా ఈ అక్రమాస్తులకు సంబంధించి పనామా పేపర్ల వ్యవహారంలో నవాజ్‌ సహా ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తె, అల్లుడు, ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌ పై పాక్‌ జాతీయ జవాబుదారీ సంస్థ నాలుగు కేసులు నమోదు చేసింది.

సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా జాతీయ జవాబుదారీ సంస్థ నివేదికల ఆధారంగా ఈ కేసులు నమోదు చేసినట్టు పాక్ జాతీయ జవాబుదారీ సంస్థ తెలిపింది. అక్రమ ఆదాయాలు, ఆస్తుల కొనుగోలుకు సంబంధించి వీరందరిపై వేర్వేరుగా కేసులు నమోదు చేయడం విశేషం. దీంతో నవాజ్ ను మరిన్ని కష్టాలు చుట్టుముట్టనున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News