: గంజాయి స్మగ్లింగ్ పై మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

గంజాయి స్మగ్లింగ్ వెనుక అందరి హస్తం ఉందంటూ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో అన్ని విభాగాలకు సంబంధించిన వ్యక్తుల పాత్ర ఉందని, ముఖ్యంగా పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. కఠినశిక్షలు విధిస్తే తప్పా ఈ సమస్య పరిష్కారం కాదని అన్నారు. గంజాయి స్మగ్లింగ్ ను అరికట్టే నిమిత్తం సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనం లేదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.

ఈ రోజు  ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ పంట ఎక్కడికి రవాణా అవుతుంది? ఎవరి ద్వారా రవాణా అవుతుంది? ఇందులో ఉన్న పెద్దలు ఎవరు? ఈ రవాణా చేసే సరుకు చెన్నై, హైదరాబాద్ వెళుతుంది. ఇది అన్ని డిపార్ట్ మెంట్లకు.. పోలీస్, ఎక్సైజ్ శాఖలకు ఓపెన్ గా తెలిసిన విషయమే. ఏ గ్రామంలో ఏ పెద్దలు సహకరిస్తున్నారో వారికి తెలుసు కాబట్టి, అటువంటి పెద్దలను అందరినీ గుర్తించి..ఓ పీడీ యాక్టు పెట్టి..వాళ్లందర్నీ లోపలేస్తే వారికి భయమొస్తుంది, గంజాయి స్మగ్లింగ్ ను కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి’ అని అన్నారు. గ్రేటర్ విశాఖలో డివిజన్ల సంఖ్యను 100కు పెంచాల్సిన అవసరం ఉందని, లేకపోతే పరిపాలన కష్టమవుతుందని అయ్యన్న అభిప్రాయపడ్డారు.

More Telugu News