: పులివెందుల సహా 175 స్థానాలూ మావే!: నారా లోకేష్

తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల సహా 175 స్థానాల్లో తామే గెలవనున్నామని ఏపీ ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీకి ఒక్క స్థానం కూడా దక్కదని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే రేపు వైకాపాకు ఎదురు కానుందని జోస్యం చెప్పారు.

 తమ ప్రభుత్వం 'జలసిరికి హారతి' కార్యక్రమాన్ని ప్రారంభించగానే, రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు పడ్డాయని, అనంతపురం జిల్లాలో మూడేళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదైందని తెలిపారు. రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని, చేపట్టిన 23 ప్రాజెక్టులనూ తాము పూర్తి చేసి తీరుతామని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును వద్దని వాదించిన వైఎస్ జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు.

More Telugu News