: ఆల్టోను దాటేసిన డిజైర్ అమ్మకాలు... అత్యధిక అమ్మకాలతో సరికొత్త రికార్డు!

ఇండియలో అత్యధికంగా అమ్ముడయ్యే కారు ఏంటంటే, నిన్నటివరకూ మారుతి సుజుకి ఆల్టో పేరు వినిపించేది. ఇప్పుడా స్థానాన్ని అదే మారుతి సుజుకి అందించే మరో కారు వేరియంట్ డిజైర్ కొట్టేసింది. గడచిన ఆగస్టు నెలలో ఆల్టో రికార్డును డిజైర్ బీట్ చేసింది. ఈ నెలలో 21,521 ఆల్టో యూనిట్లు అమ్ముడు కాగా, 30,934 యూనిట్ల డిజైర్ కార్లు విక్రయించబడ్డాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ తాజా గణాంకాలు వెల్లడించాయి.

దేశవాళీ కార్ సెగ్మెంట్ లో మారుతి సుజుకి ఆధిపత్యం కొనసాగిందని, ఇండియాలో అమ్ముడవుతున్న 10 టాప్ సెల్లింగ్ బ్రాండ్లలో ఏడు మారుతి సుజుకివేనని పేర్కొంది. గత నెలలో మారుతి సుజుకి విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనో 17,190 యూనిట్లు అమ్ముడు కాగా, ఆపై స్థానాల్లో ఎస్యూవీ విట్టారా బ్రెజా 14,396 యూనిట్లతో నిలిచింది. మారుతి సుజుకికి పోటీ ఇస్తున్న హ్యుందాయ్ చిన్న కారు గ్రాండ్ ఐ 10 12,306 యూనిట్లను విక్రయించుకోగలిగింది. గత సంవత్సరంతో పోలిస్తే మారుతి కార్ల విక్రయాలు 26.7 శాతం పెరిగి 1,19,931 యూనిట్ల నుంచి 1,52,000 యూనిట్లకు పెరిగింది. స్విఫ్ట్ తో పాటు ఎస్టిలో, డిజైర్, బాలెనో మోడల్స్ విక్రయాలు సగటున 62 శాతం వరకూ పెరిగాయని తెలిపింది.

More Telugu News