: దేశ జీడీపీ తగ్గుతోంది... నరేంద్ర మోదీ ప్రభుత్వానికి రఘురాం రాజన్ హెచ్చరిక!

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్ధికంగా వైఫల్యం చెందిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ మరోసారి విరుచుకుపడ్డారు. ఇటీవల పెద్ద నోట్ల రద్దు ఓ విఫలమైన చర్యని, దీని గురించి తనకు ముందుగానే తెలిస్తే రాజీనామా చేసుండేవాడినని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన, తాజాగా ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భారత వృద్ధి రేటు నిదానించేలా చేస్తున్నాయని, ఒక వైపు ప్రపంచ వృద్ధి రేటు గణనీయంగా పుంజుకుంటుంటే దేశ జీడీపీ తగ్గుతోందని హెచ్చరించారు. నోట్ల రద్దుతో పాటు, జీఎస్టీ కూడా వృద్ధిని తగ్గించాయని అన్నారు.

తన మూడేళ్ల పదవీ కాలంలో యూపీఏ ప్రభుత్వం ఏ నాడూ తనపై పరిమితులు, ఆంక్షలు విధించలేదని వ్యాఖ్యానించిన రాజన్, ప్రభుత్వం మారిన తరువాత ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగేందుకు తాను ఆసక్తిని చూపినప్పటికీ ఎన్డీయే ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఇండియాలో బ్యాంకులను శుద్ధి చేయాలని భావించానని అన్నారు. చికాగో యూనివర్శిటీ తనపై ఎలాంటి నిబంధనలూ పెట్టలేదని, తనకు సెలవు ఇవ్వడం వారికి కూడా ఆనందమేనని తెలిపారు.

 మోదీ ప్రభుత్వం ఆర్బీఐ గవర్నర్ ను మార్చాలని భావించిందని, అదే జరిగిందని అన్నారు. నోట్ల రద్దు బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు సహకరించిందని, అందువల్లే 99 శాతం కరెన్సీ వెనక్కు వచ్చిందని అన్నారు. నోట్ల రద్దు వల్ల జరిగిన కచ్చితమైన నష్టం ఎంతన్నది ఎవరూ చెప్పలేరని, అయితే, ఆ నష్టం ఏంటన్నది త్వరలోనే బ్యాంకర్లకు తెలుస్తుందని అన్నారు.

More Telugu News