: గుర్మీత్ డేరాలో పెద్ద సంఖ్యలో బయటపడ్డ అస్థిపంజరాలు!

పెద్ద సంఖ్యలో పారా మిలటరీ బలగాలు, సైన్యం, పోలీసులు సిర్సా సరిహద్దుల్లో 700 ఎకరాలలో విస్తరించివున్న డేరా సచ్చా సౌధాలో ముమ్మర తనిఖీలు చేస్తున్న వేళ, పదుల సంఖ్యలో అస్థిపంజరాలు బయటపడ్డట్టు తెలుస్తోంది. వీటిల్లో కొన్ని పురుష, మరికొన్ని మహిళలు, బాలికల అస్థి పంజరాలు ఉన్నట్టు తెలుస్తోంది. డేరా ప్రధాన కార్యాలయంలోకి బాంబ్ స్క్వాడ్ బృందం తమ శునకాలతో వెళ్లి తనిఖీలు నిర్వహించగా, ఇవి బయటపడ్డాయి.

డేరాలో అస్థి పంజరాలు వెలుగులోకి రావడంపై డేరా అధికార ప్రతినిధి విపాసన స్పందించింది. ఎంతో మంది భక్తులు డేరాకు వచ్చి, తాము మరణించిన తరువాత ఇక్కడే పూడ్చి పెట్టాలని కోరారని, వారి కోరిక, గుర్మీత్ విధించిన నిబంధనల మేరకే వారిని మరణానంతరం ఇక్కడ పూడ్చి పెట్టామని తెలిపారు. కాగా, ఇక్కడి అసాంఘిక కార్యకలాపాలపై ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని హత్య చేసి, ఇక్కడ పూడ్చేవారన్న ఆరోపణలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అస్థి పంజరాలు ఎవరివి? వారు ఎలా మరణించారు? తదితర విషయాలపై విచారణ జరపాలని నిర్ణయించిన పోలీసులు, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించే పనిలో ఉన్నారు.

More Telugu News