: అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ నేత!

మహారాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఏక్ నాథ్ ఖడ్సేపై కేసు నమోదైంది. దాని వివరాల్లోకి వెళ్తే... అంజలి దమనియా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆమె ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏక్‌ నాథ్‌ ఖడ్సేపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో, అంజలి దమనియా అవినీతి వ్యతిరేక పోరాట కార్యకర్తలతో కలిసి కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దీంతో ఆరోపణలు రుజువు కావడంతో ఏక్ నాథ్ ఖడ్సే మంత్రి పదవి కోల్పోయారు.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న ఆయన తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జలగావ్ లో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంజలిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆమె స్నేహితుడు ఒకరు ఆమెకు సమాచారం అందించారు. దీంతో ఆమె వకోలా పోలీసులను ఆశ్రయించారు. సంఘటన జలగావ్ లో చోటుచేసుకోవడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వకోలా పోలీసులు తెలిపారు. కాగా, దీనిపై స్పందించిన ఖడ్సే... ఆమెకు వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. అయితే అంజలి దమనియా మాత్రం తన దగ్గర వీడియో సాక్ష్యం ఉందని ఆమె తెలిపారు. 

More Telugu News