: ఏపీ వర్ధమాన క్రికెటర్ల పంట పండింది... నెల రోజుల్లో ఏపీ ఐపీఎల్... టోర్నీ, జట్ల వివరాలు ఇవిగో!
ఆంధ్రప్రదేశ్ లో వర్థమాన క్రికెటర్ల పంట పండనుంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏపీ టీ20 లీగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఐపీఎల్ స్పూర్తితో తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ క్రికెట్ సంఘాలు నిర్వహించిన లోకల్ లీగ్ లు విజయవంతమయ్యాయి. ఈ లీగులతో రాష్ట్ర క్రికెట్ బోర్డులు సుసంపన్నం కావడంతో పాటు గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశాలు కూడా దక్కుతాయని నిర్ధారణ అయింది.
ఈ క్రమంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏపీ టీ20లీగ్ ను తెరమీదకి తెచ్చింది. నెల రోజుల్లో ఈ టోర్నీ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆరు జట్ల పేర్లను ఖరారు చేశారు. వాటికి బెజవాడ బాద్షాస్, గోదావరి జాగ్వార్స్, గుంటూరు మిర్చీస్, కడప కింగ్స్, నెల్లూరు లయన్స్, వైజాగ్ వేల్స్ జట్లుగా నామకరణం చేశారు. డిసెంబర్ 2017 నుంచి జనవరి 2018 వరకు టోర్నీ నిర్వహించనున్నారు. ప్రాంఛైజీల ఎంపిక, స్పాన్సర్ షిప్ సంబంధిత వ్యవహారాలను రెడ్ మూన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు.