: పశ్చిమగోదావరి వాసులను 40 నిమిషాల పాటు బెంబేలెత్తించిన టోర్నడో తరహా సుడిగాలి!

పశ్చిమ గోదావరి జిల్లావాసులను టోర్నడో తరహా సుడిగాలి సుమారు 40 నిమిషాల పాటు బెంబేలెత్తించింది. దాని వివరాల్లోకి వెళ్తే....ఆకివీడులోని గాలిబ్‌ చెరువు ప్రాంతంలో ప్రారంభమైన సుడిగాలి కోళ్లపర్రు వంతెన సమీపంలోని రొయ్యల చెరువు, చినకాపవరం డ్రెయిన్‌, తరటావ మీదుగా హోరుగా శబ్దం చేస్తూ దూసుకుపోయింది. కోళ్లపర్రు చేపల చెరువుల్లో నీటిని సుడులు తిప్పుతూ 25 అడుగుల ఎత్తులో వృత్తాకారంలో ఫౌంటెన్ లా ఎగజిమ్మింది. దీని ధాటికి మూడు రేకుల షెడ్లతోపాటు తాటాకు గుడిసెలపై తాటి కమ్మలు, గడ్డి ఎగిరిపోగా, నాలుగైదు చెట్లు విరిగిపడ్డాయి. రొయ్యల చెరువుల్లోని ఫ్యాన్లు, మోటారుసెట్లు ధ్వంసమయ్యాయి.

గత ఏడాది కూడా ఆనాల చెరువు ప్రాంతంలో ఇలాంటి సుడిగాలే వచ్చి, ఒక భారీ చెట్టుతో పాటు, విద్యుత్ స్తంభాలు, పూరిపాకలను ధ్వంసం చేసింది. అయితే అది అర్ధరాత్రి సమయంలో రావడంతో కేవలం ఆస్తి నష్టంతో సరిపెట్టింది. కాగా, ఉష్ణోగ్రత, పీడనంలో ఏర్పడిన వ్యత్యాసాల కారణంగా ఇలాంటి సుడిగాలులు ఏర్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే ఆకాశంలో ఏర్పడిన కారుమబ్బులు, తెల్లమబ్బుల వల్ల కూడా ఇలాంటి సుడిగాలులు ఏర్పడతాయని వారు చెప్పారు. తెల్లమబ్బుల్లో తక్కువ, కారుమబ్బుల్లో ఎక్కువ పీడనం ఉండటం వల్ల ఏర్పడే వ్యత్యాసం నేపథ్యంలో టోర్నడో తరహా సుడిగాలులు రేగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. 

More Telugu News